మంథనిరూరల్//జూలై 26 (ఆకాంక్ష):

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌–2.0లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోనే అగ్రగామి సెమీకండక్టర్‌ చిప్‌ డిజైన్‌ కేంద్రంగా, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) ప్రధాన నిలయంగా హైదరాబాద్‌ ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్‌ తయారీ రంగంలో తదుపరి దశ పెట్టుబడులకు తెలంగాణ సహజ ఎంపికగా నిలుస్తుందని అన్నారు.బెంగళూరులో జాతీయ ఛానల్‌ నిర్వహించిన ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌–సౌత్‌ ఎడిషన్‌’ చర్చాగోష్టిలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా అభివృద్ధి చెందిన వాతావరణాన్ని వివరించారు. దక్షిణ భారతదేశంలో ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై చర్చించేందుకు రాజకీయ నాయకులు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సమృద్ధిగా లభించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పెట్టుబడి దారులకు అనుకూలమైన విధానాలు, అత్యుత్తమ వ్యాపార సౌలభ్యం కారణంగానే హైదరాబాద్‌ జీసీసీలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని శ్రీధర్‌బాబు తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీ వ్యవస్థతో పాటు అత్యున్నత సాంకేతిక పరిశ్రమలు, అధునాతన తయారీ రంగాలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు.ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్‌ డిజైన్‌ సంస్థలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని, దేశంలోనే అత్యంత బలమైన చిప్‌ డిజైన్‌ ఎకోసిస్టమ్‌ తెలంగాణలో ఏర్పడిందని మంత్రి వివరించారు. సెమీకండక్టర్‌ డిజైన్‌, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ భద్రత, అధునాతన ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో వేలాది మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు పని చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్‌ తయారీ కేంద్రంగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన బలమైన పునాది ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పడిందన్నారు.చిప్‌ డిజైన్‌ రంగంలో తెలంగాణ ఇప్పటికే ప్రపంచ సెమీకండక్టర్‌ పరిశ్రమకు దిశానిర్దేశం చేస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర సామర్థ్యాన్ని గుర్తించి సెమీకండక్టర్‌ మిషన్‌–2.0లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం కల్పించి చిప్‌ తయారీ పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాంకేతిక రంగంలో ఇప్పటికే తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న రాష్ట్రాలకు సముచిత ప్రోత్సాహం అందిస్తే కేంద్ర ప్రభుత్వ సెమీకండక్టర్‌ కార్యక్రమం మరింత విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ రంగంలో భారత్‌ అగ్రస్థానానికి చేరాలన్న లక్ష్యాన్ని మరింత వేగంగా సాధించవచ్చని మంత్రి అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కారణంగా హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీసీసీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.సాఫ్ట్‌వేర్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఔషధ పరిశ్రమలు, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, హాస్పిటాలిటీ, బ్యూటీ టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన అనేక బహుళజాతి సంస్థలు తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చివరి గ్రామం వరకు ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్టివిటీని విస్తరించడం ద్వారా చిన్న పట్టణాల్లోనూ డిజిటల్‌ సదుపాయాలతో పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేసే సింగిల్‌ విండో విధానం తెలంగాణను దేశంలో వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూల రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు.రానున్న రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను జీసీసీలు, కృత్రిమ మేధ ఆధారిత పరిశ్రమలు, అధునాతన తయారీ యూనిట్లకు కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇందుకోసం కొత్త ప్రోత్సాహకాలు, అత్యుత్తమ మౌలిక వసతులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్‌ డిజైన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆవిష్కరణల రంగాల్లో తెలంగాణ ఇప్పటికే సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌–2.0లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి శ్రీధర్‌బాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రతిభావంతమైన మానవ వనరులు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం, స్థిరమైన పారిశ్రామిక విధానాల కారణంగానే హైదరాబాద్‌ దేశంలో జీసీసీలకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా ఎదిగిందని అన్నారు. సెమీకండక్టర్‌ తయారీ రంగంలోనూ తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రపంచ సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ లక్ష్యాలను మరింత బలోపేతం చేయవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.